Atal Pension Yojana: అసంఘటిత రంగంలో పనిచేసే ప్రజలందరికీ వృధ్యాప్యంలో ఆర్ధిక చేయూత అందించడానికి అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఈ పథకంలో నగదు పెట్టుబడి పెట్టడం ద్వారా ఏ భారతీయ పౌరుడైనా 60 ఏళ్ల తర్వాత పెన్షన్ పొందవచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి అర్హులు. ఈ పెట్టుబడి పథకంలో పెట్టుబడి పెట్టాలంటే బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా అవసరం. ఈ పథకం తర్వాత 60 సంవత్సరాల తరువాత డిపాజిటర్లు పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు.
మీరు అందుకునే పెన్షన్ మొత్తం మీరు చేసే పెట్టుబడి, మీ వయస్సుపై ఆధారపడి ఉంటుంది. ఏపీవై కింద.. ఒక వ్యక్తి కనీసం రూ.1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000, రూ.5 వేల వరకు పెన్షన్ పెందవచ్చు. ఏపీవై ఖాతాలో నామినేషన్, జీవిత భాగస్వామి వివరాలు అందించడం తప్పనిసరి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ద్వారా నెలవారీగా లేదా త్రైమాసికానికొకసారి, అర్ధ సంవత్సరనికోకసారి చందా చెల్లింపులు చేయవచ్చు. అటల్ పెన్షన్ స్కీమ్ ముఖ్యమైన ఉద్దేశ్యం ఏమిటంటే.. మీరు ఈ పథకంలో ఎంత త్వరగా చేరితే అంత ఎక్కువ లాభం పొందవచ్చు. APY మరియు NPS లైట్ యాప్ ద్వారా ఖాతాదారులు తమ లావాదేవీల వివరాలను చూసుకోవచ్చు.
ప్రతి నెల రూ.10,000 పెన్షన్
ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో ఈ పెట్టుబడి పథకంలో చేరితే, అతడు/ఆమె 60 సంవత్సరాల వయస్సు తర్వాత నెలకు రూ.5,000 పెన్షన్ కోసం నెలకు రూ.210 జమ చేయాలి. అంటే ఈ పథకంలో రోజుకు కేవలం రూ.7ను జమ చేయడం ద్వారా నెలకు రూ.5 వేల పింఛను పొందవచ్చు. నెలకు రూ.3 వేలు పెన్షన్ కావాలంటే రూ.126, రూ.4 వేలు పెన్షన్ కావాలంటే నెలకు రూ. 168, నెలకు రూ. 2 వేలు పెన్షన్ కావాలంటే రూ. 84 చెల్లించాల్సి ఉంటుంది. మీకు కేవలం రూ.వేయి పెన్షన్ కావాలంటే మాత్రం నెలకు రూ.42 చెల్లిస్తే సరిపోతుంది. అలాగే, ఈ పెట్టుబడి పథకంలో భార్య భర్తలు ఇద్దరు కలిసి పేరు మీద పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతి నెల వారి పొదుపు ఖాతాలో వయస్సును బట్టి రూ.210 నుంచి రూ.1454 మధ్య పొదుపు చేస్తే నెల నెల ఇద్దరికీ కలిపి రూ.10 వేల పెన్షన్ పొందవచ్చు.
Support Tech Patashala
