మనం వాడుతున్న స్మార్ట్ఫోన్లలో ఎక్కువగా క్వాలకమ్, మీడియాటెక్, హెలియో ప్రాసెసర్లను వాడుతామనే సంగతి మనకు తెలిసిందే. స్మార్ట్ఫోన్లలో ప్రాసెసర్ ఒక గుండెకాయ లాంటిది, అన్నీ పనులు ఇదే చేస్తుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా 37 శాతం ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఉపయోగించిన మీడియాటెక్ ప్రాసెసర్లో భారీగా భద్రతా లోపాలు ఉన్నట్లు ప్రముఖ ఐటీ సెక్యూరిటీ సంస్థ చెక్ పాయింట్ రీసెర్చ్ ఒక సంచలన నివేదిక విడుదల చేసింది.
మీ కాల్స్ వినగలరు..!
మీడియాటెక్ ప్రాసెసర్స్తో నడిచే స్మార్ట్ఫోన్లను వాడుతున్న యూజర్ల కాల్స్ను మూడో వ్యక్తి వినే అవకాశం ఉన్నట్లు చెక్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. చెక్ పాయింట్ రీసెర్చ్ పేర్కొన్న నివేదిక ప్రకారం.. మీడియాటెక్ చిప్ ఆడియో ప్రాసెసర్లో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఒకవేళ వీటిని రెక్టిఫై చేయకుండా వదిలేస్తే హ్యాకర్లు సులభంగా వారి సంభాషణలు వినే అవకాశం ఉందని తెలిపింది. మీడియాటెక్ ప్రాసెసర్లను ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీలు షావోమీ, ఒప్పో, రియల్మీ, వివో లాంటి కంపెనీలు వాడుతున్నాయి.

చెక్ పాయింట్ రీసెర్చ్ నివేదించిన లోపాలపై మీడియాటెక్ స్పందించింది. పలు ప్రాసెసర్లలో లోపాలు ఉన్నది వాస్తవమైనప్పటికీ, ఈ లోపాల సహాయంతో ఇప్పటివరకు ఎలాంటి డేటా చౌర్యం జరిగినట్లు రుజువులేదని మీడియా టెక్ భద్రత అధికారి టైగర్ హుజ్ వెల్లడించారు. ఆయా లోపాలను కంపెనీ వెంటనే గుర్తించి, పరిష్కరించినట్లు పేర్కొన్నారు. అయితే ముందు జాగ్రత్తగా ఆయా స్మార్ట్ఫోన్ల యూజర్లు కొత్త సెక్యూరిటీ ప్యాచ్కి అప్డేట్ చేయాలని పేర్కొంది. వాటితో పాటుగా గూగుల్ ప్లే స్టోర్ వంటి విశ్వసనీయ మూలాల నుంచి మాత్రమే అప్లికేషన్లను ఇన్స్టాల్ చేసుకోవాలని కంపెనీ సూచించింది.