భారత దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ఆర్థిక ప్రగతికి సంబంధించి ప్రసంగిస్తూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భవిష్యత్తులో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం గతి శక్తి పేరుతో మాస్టర్ ప్లాన్ను ప్రకటించారు. ఈ గతి శక్తి ప్లాన్ కింద రాబోయే 25 ఏళ్లలో రూ.100 లక్షల కోట్లు నిధులను ఖర్చు చేస్తామని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో లోకల్ మాన్యుఫాక్చరర్స్ను అభివృద్ధి చేసేందుకు గతి శక్తి సాయం చేస్తుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే కొత్త ఎకనామిక్ జోన్ల వల్ల యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మోడీ తెలిపారు.
రానున్న 25 ఏండ్లలో అన్ని రంగాల్లో భారీ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేందుకు రూ.100 లక్షల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. తర్వాతి తరం టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరల్డ్ క్లాస్ మాన్యుఫాక్చర్, ఇన్నోవేషన్స్ను అందిపుచ్చుకొని భారత్ ముందుకు దూసుకెళ్లాలని అన్నారు. చిన్న చిన్న పల్లెల్లో సైతం ఫైబర్ గ్రిడ్ లాంటివి 100వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోయే నాటికి పూర్తి స్థాయి ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.
ఈ భారీ ప్రణాళికలో భాగంగా హిమాలయ రాష్ట్రాల నుంచి గిరిజన ప్రాంతాలు, తీర ప్రాంతాల వరకు భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ది అందించనున్నట్లు తెలిపారు. గతి శక్తి ప్రణాళిక భారతదేశ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. ఈశాన్య రాష్ట్రాల రాజధానులన్నింటికీ రైల్వేల సేవలను కనెక్ట్ చేసే మాస్టర్ ప్లాన్ ను త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు. ఈ ప్రాంతం పొరుగు దేశాలైన మయన్మార్, బంగ్లాదేశ్, ఆగ్నేయాసియాలోని ఇతర ప్రాంతాలతో కూడా అనుసంధానం అవుతుంది అన్నారు.