దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు(బీఎస్బీడీ) షాకిచ్చింది. జులై 1 నుంచి బీఎస్బీడీ ఖాతాదారులు ఇక ఏటీఎం నుంచైనా, శాఖ నుంచైనా నెలలో నాలుగుసార్లు కంటే ఎక్కువ సార్లు నగదు విత్డ్రాయల్ చేస్తే ఛార్జీలు వర్తిస్తాయని వెల్లడించింది. అలాగే, ఏడాదికి 10 చెక్ లీఫ్లను మాత్రమే ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది. అంతకంటే ఎక్కువ చెక్స్ తీసుకుంటే కూడా అదనంగా చార్జీలు వర్తిస్తాయని తెలిపింది.
ప్రతి లావాదేవిపై రూ.15 చార్జీ
‘అదనపు విలువ ఆధారిత సర్వీసులు అందించినందుకు‘ గాను ఈ పరిమితి దాటితే రూ.15 నుంచి రూ.75 దాకా చార్జీలు వర్తిస్తాయని ప్రకటించింది. బీఎస్బీడీ ఖాతాలకు సంబంధించిన నిబంధనలను ఈ మేరకు ఎస్బీఐ సవరించింది. వీటి ప్రకారం.. ఎస్బీఐ శాఖలు, ఏటీఎంలు లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి 4 సార్లు కంటే ఎక్కువ సార్లు నగదు విత్డ్రాయల్ చేస్తే ప్రతి లావాదేవిపై రూ.15 చార్జీతో పాటు జీఎస్టీ అదనంగా వర్తిస్తుందని బ్యాంకు పేర్కొంది. జూలై 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. ఆర్థికేతర లావాదేవీలు, ట్రాన్స్ఫర్ లావాదేవీలు సంబంధించి మాత్రం శాఖలు, ఏటీఎం, సీడీఎం (క్యాష్ డిస్పెన్సింగ్ మెషీన్ల)లలో ఉచితంగానే ఉంటాయని ఎస్బీఐ వివరించింది.
సీనియర్ సిటిజన్ కస్టమర్లకు మినహాయింపు
ఇక చెక్ బుక్ సర్వీసులకు సంబంధించి ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీఫ్లు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత 10 లీఫ్ల చెక్ బుక్కు రూ. 40, 25 లీఫ్లదైతే రూ.75 చార్జీలు వర్తిస్తాయి. వీటికి జీఎస్టీ అదనం. ఇక అత్యవసర చెక్ బుక్ కోసం రూ.50 ప్లస్ జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు మాత్రం చెక్ బుక్ సేవల పరిమితి నుంచి మినహాయింపు ఇచ్చింది. కస్టమర్ వివరాల ధ్రువీకరణ నిబంధనలకు(కేవైసీ) లోబడి ఎవరైనా బీఎస్బీడీ ఖాతా తీసుకోవచ్చు. ప్రధానంగా ఎలాంటి చార్జీలు, ఫీజుల భారం పడకుండా బడుగు, బలహీన వర్గాలను పొదుపు వైపు మళ్లించేందుకు ఈ ఖాతాలను అందిస్తున్నారు.
Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్బుక్(Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.