గత కొద్ది రోజుల నుంచి రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధానికి సైతం సై అంటున్నారు. ఫిబ్రవరి 22న రష్యా తూర్పు ఉక్రెయిన్లోని రష్యా మద్దతుగల వేర్పాటువాద డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రపంచ దేశాలు రష్యా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకి పేరుగుతుండటంతో చమురు ధరలు 7 ఏళ్ల గరిష్టస్థాయికి చేరుకున్నాయి.
ఈ యుద్ద వాతావరణం వల్ల ముడి చమరు బ్యారెల్ ధర 100 డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తునారు. ప్రపంచ బెంచ్ మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 3.48 డాలర్లు(3.7%) పెరిగి 98.94 డాలర్లుగా ఉంది. 2014 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధికం. అలాగే, యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్(డబ్ల్యుటిఐ) క్రూడ్ ఆయిల్ బ్యారేల్ ధర 4.54 డాలర్లు(4.8%) పెరిగి 95.61 డాలర్లకు చేరుకుంది.
(ఇది కూడా చదవండి: ఈపీఎఫ్ఓ చందాదారులకు శుభవార్త.. పెరగనున్న పెన్షన్ డబ్బులు!)
కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత తగ్గడంతో ప్రపంచ వ్యాప్తంగా తిరిగి పెట్రోల్, డీజిల్కి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం వల్ల చమరు ధరలు 7 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే, ఇలాంటి క్లిష్ట సమయంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ దేశాలు, ఒపెక్+గా పిలువబడే మిత్రదేశాలు చమరు సరఫరాను ఎక్కువ పెంచడానికి నిరాకరించాయి.
మూలిగే నక్క మీద తాటి పండు
అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా మన దేశంలో చమురు సంస్థలు ధరలు పెంచే అవకాశం ఉన్న ధరలను పెంచడం లేదు. దీనికి ప్రధాన కారణం, దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రాలలో ఎన్నికలు కొనసాగుతుండటమే, ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే చమురు ధరలు రూ.10 మేర పెరిగే అవకాశం ఉన్నట్లు డెలాయిట్ దేబాసిష్ మిశ్రా అన్నారు. ఒకవేల ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే దేశంలోని ప్రతి నిత్యవసర ధరలు పెరిగే అవకాశం ఉంది.
దీంతో, దేశంలో ద్రవ్యోల్బణం రేటు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరగనున్నట్లు ఆయన అన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడు చితకి పోతున్నాడు. దీంతో, మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు సామాన్యుడి పరిస్థితి ఉండనుంది.