ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓలా స్కూటర్ కి వచ్చిన క్రేజ్ మరే ఇతర స్కూటర్ కి రాలేదని చెప్పుకోవాలి. ఆగస్టు 15న వస్తున్న ఓలాకి పోటీగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ సింపుల్ ఎనర్జీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను సింపుల్ వన్ ఆగస్టు 15న తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇందులోనే ఫీచర్స్ కూడా ఓలాకి పోటీ ఇచ్చే రీతిలోనే ఉన్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వస్తున్న ఈ-స్కూటర్ ను అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ₹1,947 ధరకు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు అని కంపెనీ తెలిపింది.
“సింపుల్ వన్ తో ఎలక్ట్రిక్ వాహన రంగంలో బెంచ్ మార్క్ సృష్టించాలని మేం ఆశిస్తున్నాం. ఆగస్టు 15 మాకు చారిత్రాత్మక రోజు” అని కంపెనీ వ్యవస్థాపకుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుహాస్ రాజ్ కుమార్ అన్నారు. ఈ సింపుల్ వన్ స్కూటర్ తన ప్రధాన ప్రత్యర్థులైన ఓలా స్కూటర్, అథర్ 450ఎక్స్ తో తలపడనుంది. సింపుల్ వన్, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండు కూడా ఆగస్టు 15న విడుదల కానున్నాయి. అథర్ 450 ఎక్స్ ఇప్పటికే మార్కెట్లో ₹99,000 ధరకు అందుబాటులో ఉంది. ఈ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 6 కేజీల కంటే ఎక్కువ బరువు గల 4.8 కిలోవాట్ అవర్(కెడబ్ల్యుహెచ్) లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేయనున్నట్లు సంస్థ పేర్కొంది.

సింగిల్ చార్జ్ తో 240 కి.మీ ప్రయాణం
ఈ స్కూటర్ బ్యాటరీ 70 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ కానున్నట్లు కంపెనీ తెలుపుతుంది. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే ‘ఎకో మోడ్’లో 240 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇది గంటకు 100 కి.మీ టాప్ స్పీడ్ తో దూసుకెళ్తుంది. ఇది 3.6 సెకన్లలో 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే టచ్ స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆన్ బోర్డ్ నావిగేషన్ సపోర్ట్ ఉన్నాయి. సింపుల్ వన్ ధర ₹1,00,000 నుంచి ₹1,20,000 వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే, ఆగస్టు 15న రానున్న ఓలా స్కూటర్ ధర కూడా ₹1,20,000 ఉండే అవకాశం ఉంది.
Support Tech Patashala
