వోక్స్ వ్యాగన్ గ్రూప్కు చెందిన వేల కార్లను తీసుకొని వెళ్తున్న భారీ కార్గో షిప్ “ఫెలిసిటీ ఏస్” అట్లాంటిక్ మహాసముద్రంలోని అజోర్స్ దీవుల సమీపంలో నౌకలో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆ భారీ కార్గో షిప్లో 22 ఉన్న మంది సిబ్బందిని పోర్చుగీస్ నావికాదళం, వైమానిక దళం సురక్షితంగా రక్షించి స్థానిక హోటల్కు తరలించినట్లు నౌకాదళం ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం మంటల్లో షిప్ కాలిపోతూ మధ్య అట్లాంటిక్లో కొట్టుకుపోతునట్లు తెలుస్తోంది.
జర్మనీలోని వోల్ఫ్స్బర్గ్ నగరంలో వోక్స్ వ్యాగన్ గ్రూప్కు చెందిన తయారీ కర్మగారంలో పోర్స్చే, ఆడి, లంబోర్ఘిని వంటి లగ్జరీ కార్లను తయారు చేస్తుంది. ఈ లగ్జరీ కార్లను తీసుకొని ఫిబ్రవరి 10న జర్మనీలోని ఎండెన్ ఓడరేవు నుంచి బయలు దేరిన “ఫెలిసిటీ ఏస్” భారీ వాణిజ్య నౌక వాస్తవానికి ఫిబ్రవరి 23 ఉదయం అమెరికాలోని డేవిస్విల్లేకు చేరుకోవాల్సి ఉంది. అయితే, గమ్యానికి చెరకముందే మార్గం మధ్యలో అగ్ని ప్రమాదానికి గురైంది. ఇప్పుడు ఆ లగ్జరీ కార్లు అన్నీ అగ్ని ప్రమాదం జరిగిన వాహన నౌకలో ఉన్నాయి. వాటిలో జీటీఐ, గోల్ఫ్ ఆర్, ఐడి.4 మోడల్స్ ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం.

పోర్స్చే ప్రతినిధి లూక్ వాండెజాండే మాట్లాడుతూ.. మంటలు చెలరేగిన సమయంలో ఫెలిసిటీ ఏస్ కార్గో షిప్లో ఉన్న కార్లలో సుమారు సంస్థకు చెందిన 1,100 కార్లు ఉన్నాయని కంపెనీ అంచనా వేసింది. ఈ కార్లను బుక్ చేసుకున్న వినియోగదారులను స్థానిక ఆటోమొబైల్ డీలర్లు సంప్రదిస్తున్నారు అని తెలిపారు. వాణిజ్య నౌక “ఫెలిసిటీ ఏస్” నుంచి 22 మంది సిబ్బంది సురక్షితంగా, క్షేమంగా ఉన్నారని తెలవడం ఒక ఉపశమనం అని వాండెజాండే తెలిపారు. పోర్స్చే తయారీ కంపెనీ సముద్రంలో తన కార్లు చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. గ్రాండే అమెరికా అనే భారీ నౌకలో 2019లో మంటలు చెలరేగి మునిగిపోయినప్పుడు అందులో ఆడి, పోర్స్చేతో సహా 2,000 కు పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ భారీ నౌకను ఒడ్డుకు చేర్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయని పోర్చుగీస్ నావికాదళం తెలిపింది.