ఇప్పటి వరకు మనం సినిమా థియేటర్లలో బాహుబలి సినిమా వంటి పెద్ద పెద్ద సినిమాలు చూసినప్పుడు వచ్చే ఆ కిక్కే వెరప్ప!. అదే నిన్న చెన్నై – కోల్ కతా మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ లైవ్ మ్యాచ్ థియేటర్లలో చూస్తే ఎలా ఉంటుదో ఒకసారి ఊహించుకోండి! బొమ్మ అదుర్స్ కదూ. అలా వింటుంటేనే ఎప్పుడెప్పుడు చూద్దామా? అని మీకు అనిపిస్తుందా?. అయితే, కొంచెం ఓపిక పట్టండి మీ కల కొద్ది రోజుల్లోనే నిజం కాబోతుంది. ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ప్రపంచ కప్లో టీమ్ ఇండియా మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాన్ని తమ థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు మల్టీప్లెక్స్ సంస్థ ఇనాక్స్ లీజర్ లిమిటెడ్ తెలిపింది.
ఇనాక్స్ మల్టీప్లెక్స్ల్లో ప్రపంచ కప్ లైవ్ మ్యాచ్
యూఏఈ, ఒమన్లలో బీసీసీఐ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ 17న ప్రారంభం కానుంది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వచ్చేసి నవంబరు 14న జరగనుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్తో పాటు టీమ్ ఇండియా ఆడనున్న అన్ని లీగ్ మ్యాచ్లను మల్టీప్లెక్స్ల్లో ప్రదర్శించనున్నట్లు ఇనాక్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గల ఇనాక్స్ మల్టీప్లెక్స్ల్లో మ్యాచ్లను ప్రత్యక్షంగా ప్రదర్శించనుంది.
పెద్ద థియేటర్ స్క్రీన్ పై ప్రత్యక్ష ప్రసారం ద్వారా.. క్రికెట్ మైదానంలోనే మ్యాచ్ను వీక్షిస్తున్న అనుభూతిని ప్రేక్షకులకు కలగజేయాలన్నదే దీని వెనుక ప్రధాన ఉద్దేశమని కంపెనీ పేర్కొంది. క్రికెట్ మ్యాచ్ల వీక్షణకు టికెట్టు ధర నగరాన్ని బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటుందని తెలిపింది. ఐనాక్స్కు 70 నగరాల్లో 56 మల్టీప్లెక్స్లు, 658 థియేటర్లు ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే టికెట్ విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది.(చదవండి: ఫెస్టివల్ బంపర్ ఆఫర్.. ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్!)
పీవీఆర్ సినిమాస్
ఇండియాలో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2021ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)తో ఒక ఒప్పందాన్ని చేసుకున్నట్లు పీవీఆర్ సినిమాస్ ప్రకటించింది. పీవీఆర్ మల్టీప్లెక్స్ల్లో సెమీ ఫైనల్స్, ఫైనల్తో పాటు టీమ్ ఇండియా ఆడనున్న అన్ని లీగ్ మ్యాచ్లను థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. దేశంలోని 35కి పైగా నగరాల్లో 75కు పైగా మల్టీప్లెక్స్ల్లో ఈ మ్యాచ్లు ప్రసారం చేయనున్నారు. ఇందులో న్యూఢిల్లీ, ముంబై, పూణే, అహ్మదాబాద్ వంటి టైర్-1, టైర్-2 నగరాలు ఉన్నాయి.