ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన లారీ చెన్ పరిస్థితి 6 నెలల్లో ఒక్కసారిగా తలక్రిందులుగా మారిపోయింది. చైనా ప్రభుత్వం ప్రైవేట్ విద్యారంగంపై కఠిన నిబందనలు విధించడంతో చెన్ తన బిలియనీర్ హోదాను కోల్పోయాడు. గ్వోటు టెచెడు ఇంక్ వ్యవస్థాపకుడు, చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన చెన్ ఆస్తి విలువ ఇప్పుడు 336 మిలియన్(రూ.2,498కోట్లు) డాలర్లకు పడిపోయింది. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, తన ఆన్ లైన్-ట్యూటరింగ్ సంస్థ షేర్లు శుక్రవారం న్యూయార్క్ ట్రేడింగ్ లో భారీగా నష్టపోయాయి.
చైనా ప్రభుత్వం ఇటీవల విద్యారంగానికి సంబందించి కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నిబందనల ప్రకారం పాఠ్యాంశాలను బోధించే సంస్థలు లాభాలు సంపాదించుకోకూడదు, అలాగే మూలధనాన్ని పెంచుకోకూడదు. అయితే, ఈ నిర్ణయంతో లారీ చెన్ సంపద కేవలం ఆరు నెలల కాలంలో 15 బిలియన్(రూ.1,11,527 కోట్లు) డాలర్ల నుంచి 336 మిలియన్ (రూ.2,498 కోట్ల) డాలర్లకు పడిపోయింది. 2021 జనవరి 27న 142 డాలర్లుగా ఉన్న గావోటు స్టాక్ ధర నేడు 2.72 డాలర్లకు పడిపోయింది. గావోటు “నిబంధనలను పాటిస్తుంది, సామాజిక బాధ్యతలను నెరవేరుస్తుంది” అని చెన్ చైనీస్ సోషల్ మీడియా వీబోలో తెలిపారు.
కేవలం చైనాలో చెన్ మాత్రమే తన సంపదను పోగొట్టుకోలేదు. న్యూయార్క్ లో కంపెనీ షేర్లు 71% పడిపోవడంతో తాల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సీఈఓ జాంగ్ బాంగ్సిన్ సంపద 2.5 బిలియన్ డాలర్లు నుంచి 1.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అలాగే, న్యూ ఓరియంటల్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ గ్రూప్ ఇంక్. ఛైర్మన్ యు మిన్హాంగ్ తన బిలియనీర్ హోదాను కోల్పోయారు. చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యారంగానికి సంబంధించిన సంస్థల షేర్ల ధర భారీగా పడిపోవడంతో మొత్తంగా రూ.8 లక్షల కోట్లు నష్ట పోయినట్లు చైనా నిపుణులు తెలుపుతున్నారు. చైనాలో ఉన్న ప్రైవేట్ కంపెనీలకు మన దేశంలో ఉన్న సంస్థలకు లాగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉండదు. అక్కడి ప్రతి కంపెనీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడవాల్సి ఉంటుంది.
Support Tech Patashala
