మీరు కొత్తగా పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పాస్పోర్టు సేవా కేంద్రాల ద్వారా పాస్పోర్టు సేవలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) అందిస్తూ వచ్చింది. ఇక నుంచి కొత్తగా పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వారు భారతదేశంలోని వివిధ తపాలా కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఇండియా పోస్ట్ తెలిపింది. ఇక నుంచి పాస్పోర్టు దరఖాస్తు కోసం మీ దగ్గరలోని పోస్టాఫీసు కామన్ సర్వీస్ సెంటర్లను(సీఎస్ సీ) సందర్శించాల్సి ఉంటుంది అని పేర్కొంది.
పాస్పోర్టు రిజిస్ట్రేషన్, దరఖాస్తు సదుపాయం గురించి ఇండియా పోస్ట్ ట్వీట్ ద్వారా తెలియజేసింది. “ఇప్పుడు మీ సమీప పోస్టాఫీసు సీఎస్ సీ కేంద్రాల వద్ద పాస్పోర్టు రిజిస్ట్రేషన్/దరఖాస్తు చేసుకోవడం సులభం. మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం సమీప పోస్టాఫీసును సందర్శించండి”అని ట్వీట్ లో పేర్కొంది. పాస్పోర్టు కోసం ఆన్ లైన్ లో రిజిస్టర్/దరఖాస్తు చేసిన తర్వాత పాస్పోర్టు దరఖాస్తుదారులు ఇప్పుడు దరఖాస్తు ప్రింట్ రసీదు, ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాస్పోర్టు సేవా కేంద్రం లేదా పాస్పోర్టు సౌకర్యం గల సమీప పోస్టాఫీసును సందర్శించవచ్చు. ఇటీవలే ఇండియా పోస్ట్ పెన్షనర్లు, ఇతర సీనియర్ సిటిజన్లకు అందించే లైఫ్ సర్టిఫికేట్ సేవలను పోస్టాఫీసు కేంద్రాలలో ప్రవేశపెట్టింది. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న తపాలా కార్యాలయాల ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్ సేవలు, ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్ డోర్ స్టెప్ సేవలను ఇండియా పోస్ట్ అందిస్తుంది.
Support Tech Patashala
