కేంద్ర త్వరలో పార్లమెంట్లో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో పీఎం కిసాన్ రైతులకు తీపికబురు అందించేందుకు సిద్దం అవుతుంది. ఈ 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రైతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకొనున్నట్లు తెలుస్తుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ప్రతి ఏడాది అందించే మొత్తాన్ని రూ.6000 నుంచి రూ.8000 వేలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డిమాండ్ ఆధారిత వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రత్యేక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.
అలాగే, ఈ బడ్జెట్లో అన్ని పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించేందుకు ఒక ప్యానెల్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్యానెల్ను ఏర్పాటు చేయాలని రైతులు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో పోరాటం చేసిన రైతుల ప్రధాన డిమాండ్ కూడా ఇదే. గతంలో ప్రకటించిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన తర్వాత ఎంఎస్పీపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.