Friday, April 19, 2024
HomeGovernmentసాదాబైనామా అంటే ఏమిటి? దీనికి ఎవరు అర్హులు..?

సాదాబైనామా అంటే ఏమిటి? దీనికి ఎవరు అర్హులు..?

తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. విలీన గ్రామాల్లో సాదాబైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయవిక్రయాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 10ని చివరి గడువు తేదీగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అసలు మనలో చాలా మందికి సాదాబైనామా అనే పదానికి అర్దం కూడా తెలీదు. సాదాబైనామా అంటే తెల్ల కాగితంపై భూమి కొనుగోలు లేదా రిజిస్టర్ కాని క్రయ విక్రయాలు చేసిన భూములను విదానాన్ని సాదాబైనామా అంటారు. రిజిస్ట్రేషన్ కానీ ఏ కాగితాల ద్వారా భూమి కొనుగోలు చేసినా అది సాదాబైనామా కొనుగోలే అవుతుంది. అన్ రిజిస్టర్డ్ (రిజిస్ట్రేషన్ కాని) కొనుగోలుపై ఏదైనా పట్టా పొందాలంటే వాటిని రెగ్యులరైజేషన్ చేయించుకోవడం, లేదా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చేస్తేనే పట్టా వస్తుంది. బాండు పేపర్పై లేదా స్టాంపు పేపర్ మీద భూమి కొనుగోలు చేసిన లేదా వాటిని నోటరీ చేయించుకున్నా సరే అన్ రిజిస్టర్డ్ (రిజిస్ట్రేషన్ కాని) కొనుగోలు కిందికే వస్తుంది.

సాదాబైనామాకి ఎవరు అర్హులు/అనర్హులు..?

  • తెలంగాణ వచ్చిన 2014 జూన్ 2 నాటికి తెల్ల కాగితంపై భూమి కొనుగోలు లేదా రిజిస్టర్ కాని క్రయ విక్రయాలు చేసిన భూములు కొని గతంలోనే పట్టా కోసం దరఖాస్తు పెట్టుకున్నా ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. మళ్లీ దరఖాస్తు చేసుకుంటేనే ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో, ఉత్తర్వులు ఆధారంగా క్రమబద్ధీకరణ చేయడానికి వీలు అవుతుంది.
  • సాదాబైనామా ద్వారా పట్టా చేయాలంటే భూమి అమ్మిన వ్యక్తులు / వారసుల సమ్మతి అవసరం. ఒక వేళ సాదాబైనామా క్రమబద్ధీకరణకు అమ్మిన వ్యక్తి కానీ, అతడి వారసులు కానీ, లేదా ఇతర ఆసక్తి గల వ్యక్తులు గానీ తగిన కారణాలు, ఆధారాలతో అభ్యంతరాలు చెప్పినట్లయితే సాదాబైనామా క్రమబద్ధీకరణ దరఖాస్తును తహసీల్దార్ తిరస్కరిస్తారు.
  • ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల బదిలీ నిషేధ చట్టం, 1977, సెక్షన్3 ప్రకారం అసైన్మెంట్ భూములు అమ్మడం కానీ, కొనుగోలు కానీ చేయరాదు. అటువంటి లావాదేవీలు చెల్లవు. అసైన్మెంట్ భూమిని తెల్ల కాగితంపై కానీ, రిజిస్టర్ కాగితం ద్వారా కానీ, మరే విధంగా కానీ కొనుగోలు చేసినా పట్టారాదు. అంతేగాక కొన్నవారికి ఆరు నెలల జైలు శిక్ష రూ.2000 వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చును.
  • ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ప్రాంతాల భూ బదలాయింపు చట్టం 1959, సెక్షన్ 3(ఎ) ప్రకారం షెడ్యూల్ / ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు కానీ, లేదా గిరిజనులతో కూడిన సొసైటీ కానీ మాత్రమే స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు. గిరిజనేతరులు షెడ్యూల్ / ఏజెన్సీ ప్రాంతాల్లో సాదా కాగితంపై భూమి కొనుగోలు చేస్తే పట్టారాదు. గిరిజనులు కొనుగోలు చేస్తే పట్టా పొందవచ్చు.
  • సీలింగ్ మిగులు భూములు అనగా ప్రభుత్వ భూములు. వీటిని ఏ విధంగా కొనుగోలు చేసినా పట్టారాదు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్, 1905 ప్రకారం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడం నేరం.
  • సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు మీ సేవ కేంద్రంలో రూ.45 చెల్లించాలి. దరఖాస్తుదారుడు చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును తెలంగాణ ప్రభుత్వం మినహాయించింది. ఈ మినహాయింపు ఐదు ఎకరాలలోపు కొనుగోలు చేసిన భూమికి మాత్రమే వర్తిస్తుంది.
  • సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను, ఇతర ఆధారాలను టీఆర్ఎల్ఎంఎస్లో నమోదు చేసి కంప్యూటర్లో పొందుపరుస్తారు. సాదాబైనామా క్రమబద్ధీకరణ చేస్తూ దరఖాస్తుదారుడికి 13బి సర్టిఫికెట్, సబ్ రిజిస్ట్రార్కు నమూనా 13-సిలో సమాచారం అందజేస్తారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుక్-1 ఎస్కంబరెన్స్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేస్తారు. ఫారం-11బి రిజిస్టర్లో తహసీల్దార్ వివరాలను నమోదు చేసి దరఖాస్తుదారుడికి పాస్పుస్తకం, టైటిల్ డీడ్లు జారీ చేస్తారు.
  • అన్నదమ్ముల భాగం పంపకాల ఒప్పందం కూడా సాదాబైనామా కిందికి రాదు. భాగం పంపకాల ద్వారా భూమి పొందిన వ్యక్తులు ఫారం 6ఏలో పట్టా కోసం దరఖాస్తు చేసుకోవాలి.
  • సాదాబైనామా ద్వారా తండ్రి కొనుగోలు చేసిన భూమిని తండ్రి చనిపోతే వారసులు తండ్రి సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూమిని క్రమబద్ధీకరించుకోవచ్చు.
  • ఆర్వోఆర్ చట్టం గ్వారా గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తేనే క్రమబద్ధీకరణ చేసుకోవడానికి వీలవుతుంది. ఇంటి స్థలాలు క్రమబద్ధీకరణ చేయడానికి వీలు లేదు.
  • 2-6-2014 నాటికి జరిగిన భూమి కొనుగోళ్లను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. ఇంతకు మనుపు 31-12-2000 సంవత్సరం కంటే ముందు జరిగిన కొనుగోళ్లు మాత్రమే క్రమబద్ధీకరించేవారు. ఈ గడువును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2-6-2014 (తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తేదీ)వరకు పొడిగించింది. దీని వలన 31-12-2000 నుంచి 2-6-2014 మధ్య కాలంలో సాదాబైనామా ద్వారా భూమి కొనుగోలు చేసిన వాళ్లు కూడా క్రమబద్ధీకరణ చేసుకొని పట్టా పొందడానికి అవకాశం చేకూరింది.
  • సాదాబైనామాలపై భూములు కొని అనుభవిస్తున్న చిన్న, సన్నకారు రైతులు, తమ కొనుగోళ్లను సెక్షన్ 5-ఏ ప్రకారం తహసీల్దారుతో క్రమబద్ధీకరించుకోవచ్చు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 02-06-2014 కంటే ముందు తెల్లకాగితాల ద్వారా జరిగిన భూమి కొనుగోళ్లు మాత్రమే క్రమబద్ధీకరింపబడతాయి. క్రమబద్దీకరణ కోరు వ్యక్తి తహసీల్దార్కు మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకొని ఉండాలి. తహసీల్దార్ 13బీ సర్టిఫికెట్ జారీ చేసిన త రువాత పట్టాదార్ పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ పొందవచ్చు.
  • 13బీ సర్టిఫికెట్ జారీ చేసిన తరువాత తహసీల్దార్ ఫారం-1, 1ఏ రిజిస్టర్లో మార్పులు చేసి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ జారీ చేస్తారు. ఒక వేళ ఆ విధంగా పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ జారీ చేయనట్లయితే 13-బి నకలును జత చేస్తూ ఫారం 6ఏలో తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలి.
  • సాదాబైనామా కాగితం పోయినట్లయితే?.. ఆర్వోఆర్ చట్టం సెక్షన్ 5-ఏ, రూల్ 22, ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 153, సీసీఎల్ఏ ఉత్తర్వుల ప్రకారం సాదాబైనామా కాగితం ఉంటేనే క్రమబద్ధీకరణ చేస్తారు. సాదాబైనామా కాగితం ఉంటేనే ఆ కాగితానాకి 13బీ సర్టిఫికెట్ జారీ చేయడం ద్వారా రిజిస్టర్డ్ దస్తావేజుకు ఉన్న విలువను కల్పిస్తారు.
  • 13బి సర్టిఫికెట్ అంటే?.. సాదాబైనామా కాగితానికి రిజిస్టర్డ్ దస్తావేజుకు ఉన్న విలువను కల్పిస్తూ, తహసీల్దార్ జారీ చేసే సర్టిఫికెట్నే 13బి సర్టిఫికెట్ అంటారు. ఈ 13బి సర్టిఫికెట్ ఉంటేనే తెల్లకాగితం ద్వారా కొనుగోలు చేసిన భూములకు పాస్పుస్తకం, టైటిల్ డీడ్లు ఇస్తారు.
  • గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూములకు మాత్రమే ఈ క్రమబద్ధీకరణ వర్తిసుది. నగర పాలక సంస్థలైన హెచ్ఎండీఏ, కుడా, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ పరిధిలోని భూములకు ఈ క్రమబద్ధీకరణ వర్తించదు. సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూమి భూ సంస్కరణల చట్టం 1973, పట్టణ భూ పరిమితి చట్టం,1976, ఎల్టీఆర్ చట్టం 1959, అసైన్డ్ భూముల బదలాయింపు నిషేదిత చట్టం, 1977, వక్ఫ్ చట్టం, 1995, ఎవాక్యు ప్రాపర్టీ 1950, ఎనిమి ప్రాపర్టీ చట్టం 1968, భూదాన్ చట్టం 1965, దేవాదాయ చట్టం 1987 ఉల్లంఘించి ఉండకూడదు. అంటే, అసైన్డ్ భూములను, సీలింగ్ మిగులు భూములను, గిరిజన భూములను, భూదాన్ భూములను, వక్ఫ్ భూములను, దేవాదాయ భూములను సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసినట్లయితే క్రమబద్ధీకరించడానికి వీలులేదు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles