సామాన్యులకు కేంద్రం మరోసారి భారీ షాక్ ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. ఇప్పటికే, దేశంలో బగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్, టమాటా, నిత్యావసర సరుకుల ధరలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఉంది సామాన్యుడి పరిస్థితి. తాజాగా ఆటోలో ప్రయాణించే వారిపై కేంద్రం జీఎస్టీ విధించనుంది. అంటే.. ఆటో ఎక్కి దిగితే చాలు ఇకపై చార్జీకి అదనంగా జీఎస్టీ చెల్లించాల్సిందే. ఆటో రిక్షా బుకింగ్ పై 5 శాతం జీఎస్టీ వసూలుకు నిర్ణయించింది.
(చదవండి: ఈ స్మార్ట్ఫోన్లను వాడుతున్నారా..! అయితే మీ కాల్ డేటా హ్యకర్ల చేతికి చిక్కినట్లే..!)
అయితే, ఈ జీఎస్టీ అనేది సాధారణ ఆటో ప్రయాణాల మీద వర్తించదు. ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ ఓలా, ఊబర్ సంస్థల అందించే ఆటో రిక్షా సేవల పైన ఈ జీఎస్టీ వర్తిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం ఈ నెల 18నే ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఈ కొత్త జీఎస్టీ నిబంధనలు వచ్చే ఏడాది అంటే 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్ పై జీఎస్టీ మినహాయింపు ఉండేది. దాన్ని ఇప్పుడు కేంద్రం ఉప సంహరించుకుంది.