తెలంగాణలో అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు జూన్ 15 నుంచి రైతు బంధు సాయం పంపిణీ అందించున్నట్లు సిఎం కేసీఆర్ తెలిపారు. జూన్ 15 నుంచి జూన్ 25లోగా విడతల వారీగా రైతుల అకౌంట్లలో నగదు జమ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయశాఖపై నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జూన్ 10వ తేదీ లోపు కొత్త పట్టాదారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. పెట్టుబడి ఆర్ధిక సహాయం కింద ఎకరానికి రూ. 5 వేలు చొప్పున రెండు రబీ, ఖరీఫ్ కాలంలో అందిస్తున్నారు.
విత్తనాలు, ఎరువుల కల్తీని అరికట్టాలని ఈ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. కల్తీ నివారణ కోసం అవసరమైతే చట్ట సవరణ చేయాలని కూడా ఆయన అధికారులకు సూచించారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో ఆరునూరైనా వ్యవసాయ రంగాన్ని పునరుజ్జీవింప చేసి, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనే సిద్దాంతంతో, వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. మిషన్ కాకతీయ తోపాటు, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాల మాగాణాగా తెలంగాణను తీర్చిదిద్దడంలో విజయం సాధించామని, రాష్ట్ర వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మకంగా మార్చివేసామన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ‘‘తెలంగాణ వ్యవసాయం ఎక్కడ ప్రారంభమైంది ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నదనే విషయాన్ని పరిశీలించినప్పుడు సంభ్రమాశ్చర్యం కలుగుతుంది. నీటికి కట కటలాడిన తెలంగాణలో నేడు 75 శాతం చెరువులు నదీ జలాలలతో నిండి వున్నయి. నడి ఎండాకాలంలో నిండుకుండలను తలపిస్తున్నవి. ఒక్కవానపడితే చెరువులు అలుగులు దునకడానికి సిద్ధంగా వున్నవి. రెండు పంటలకు కలిపి తెలంగాణలో నేడు కోటిన్నర టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతు పండిస్తున్నారంటే మామూలు విషయం కాదు.
పంజాబ్ కు సరిసమానంగా తెలంగాణలో వరిధాన్యం దిగుబడి అవుతున్నది. అంతే ధాన్యాన్ని ఇవ్వాల ప్రభుత్వం ఒక్క గింజను పోనియ్యకుంటా నేరుగా రైతు వద్దనుంచి కల్లాల్లోనే కొంటున్నది. కరోనా వంటి కష్ట కాలంలో దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే రైతునుంచి ధాన్యాన్ని కొంటున్నది. అందుకు మనం గర్వపడాలి’’ అని సీఎం అన్నారు.